సీసీ ఫుటేజీ, విక్రయ రికార్డుల పరిశీలన
అధిక ధరల వసూళ్లపైనా ఆరా
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ హెచ్చరిక
దంతాలపల్లి, ఆగస్టు 24 (నమస్తే న్యూస్)
దంతాలపల్లి మండల కేంద్రంలోని వైన్ షాపుల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐ రవళి రెడ్డి ఆధ్వర్యంలో వైన్ షాపులను పరిశీలించి, మద్యం విక్రయాలపై ఆరా తీశారు.తనిఖీల సందర్భంగా షాపుల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. మైనర్లకు మద్యం విక్రయించారనే ఆరోపణలపై ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఎస్ఐ రవళి రెడ్డి మాట్లాడుతూ, మైనర్లకు మద్యం విక్రయించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వైన్ షాపులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు మద్యం విక్రయించకుండా నిబంధనలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు.అయితే, మైనర్లకు మద్యం విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం ఒకరోజు తనిఖీలకే పరిమితం కాకుండా ఎక్సైజ్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా వైన్ షాపుల వద్ద మైనర్ల సంచారాన్ని అరికట్టడంతో పాటు, సీసీ కెమెరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తనిఖీల్లో అధికారులు మధుసూదన్, రమేష్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

