డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 16(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగు నీళ్లు ఎక్కడికక్కడ నిలిచి దోమల బెడద విపరీతంగా పెరిగిందని సీపీఎం మండల నాయకులు బాణాల రాజన్న ఆరోపించారు.దీంతో ప్రజలు టైఫాయిడ్,మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం,మందులు అందుబాటులో లేక,ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.వెంటనే డ్రైనేజీలను శుభ్రం చేసి దోమల బెడదను అదుపు చేయాలని,ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అనేక వార్డుల్లో సర్వే నిర్వహించగా ప్రజలు పన్నులు కడుతున్నా వీధి లైట్లు,సీసీ రోడ్లు లేవని వాపోయారని చెప్పారు.బంగ్లా నడిగుడ్డులో బీరవాల జగదీష్ వెనక సందు బజారులో కనీసం మట్టి కూడా పోయలేదని,పాములు,తేళ్ల భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు.అక్కడ కరెంటు పోల్,లైట్లు,మట్టి రోడ్లు కూడా లేవని,మైనార్టీ కాలనీలో కూడా రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే మున్సిపాలిటీ కమిషనర్,సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.లేనిపక్షంలో ప్రజలను సమీకరించి దశలవారీగా మున్సిపాలిటీ ఆఫీసు ముందు పోరాటం చేస్తామని హెచ్చరించారు.అనంతరం చిల్లంచర్ల గ్రామంలో సీపీఎం శాఖ సమావేశం చేనేబోయిన వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాజన్న మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని,ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున ఒక్కో ఇంటికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.గ్రామాల్లో సైడ్ కాలువలు లేక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని,దీన్ని వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు 2500 రూపాయల పెన్షన్,వికలాంగులకు 6000 రూపాయలు,చేనేత,గీత,ఒంటరి మహిళల పెన్షన్లను పెంచాలని,రేషన్ కార్డుపై 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో మండల నాయకులు తాటికొండ అనంతచారి,దొంతు మమత,అలవాల యాకమ్మ,బాణాల ఎల్లయ్య,దొంతు సోమన్న,భూక్యా చందు,నాయక్కోట శ్రీకాంత్,ఓర్సు మల్లయ్య,తూము విజయ్ కుమార్,ఉండ్రాచి సురేష్,పోలోజు సోమన్న,బోలు సాయి,సందు సోమన్న,ఎల్లె రాములు,బొజ్జమంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


