ముత్యాలమ్మ గుడికి బాట నిర్మాణం.. రైతుల సహకారంతో సాకారం.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 12(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంకందికొండ గ్రామంలోని వందేళ్లుగా బాటలేని ముత్యాలమ్మ గుడికి రహదారి నిర్మాణం చేపట్టి కందికొండ గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున చరిత్ర సృష్టించారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.కందికొండ గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ గుడికి భక్తులు,గ్రామస్థులు వెళ్లేందుకు అనువుగా రహదారి నిర్మాణం చేపట్టారు.సుమారు వందేళ్లుగా ఆలయానికి సరైన దారి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు,రైతుల సహకారంతో బాట నిర్మించినట్లు తెలిపారు.ఆలయానికి దారి నిర్మాణానికి తమ భూములను,సహకారాన్ని అందించిన రైతులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.బాట నిర్మాణానికి గాద తిరుమలయ్య,కంబాల వెంకన్న,బండి శంకరం,వెంకట్,నరసయ్య తదితర రైతులు సహకరించారు.వందేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు గ్రామ ప్రజలు,రైతుల సహకారంతో పరిష్కారం లభించడంతో ముత్యాలమ్మ ఆలయ భక్తులు,గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని సర్పంచ్ తుడుసు నాగార్జున పేర్కొన్నారు.


