విద్యుత్ షాక్తో యువ రైతు మృతి.
గుర్తూరు గ్రామంలో మిన్నంటిన విషాదం.
తొర్రూరు,ఆగస్టు 01(నమస్తే న్యూస్)
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద సంఘటన తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.గుర్తురు గ్రామానికి చెందిన ఈదునూరి సమ్మయ్య (35) అనే యువ రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ బోర్ మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్ తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.శుక్రవారం రాత్రి 9 గంటలు దాటుతున్నా సమ్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన మొబైల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితులు హుటాహుటిన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వెతికారు. అప్పటికే మోటారు వద్ద సమ్మయ్య విద్యుత్ షాక్తో విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.చిన్న వయసులోనే ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో సమ్మయ్య భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి వెల్లడించారు.

