- ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ కీలక సూచనలు.
- ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అవగాహన.. రైతు వేదికలో విత్తన మేళా.
నర్సింహులపేట,జూలై 28 (నమస్తే న్యూస్)
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అధిక సాగునీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచిస్తోంది.ఈ నేపథ్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో విత్తన మేళా నిర్వహించనున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను మండల వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ పూర్తి చేసినట్లు తెలిపారు.వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


