రైతు రాజ్యం అంటే ఇదేనా?: రెండు దశాబ్దాలుగా
తిప్పారెడ్డిగూడెం రైతుల పొలాల బాటల కష్టాలు!
పొలాలకు వెళ్దామంటే కాలినడకే దిక్కు.. పంట ఇంటికి చేరాలంటే భుజాలే ఆధారం!
రహదారి లేక పెరుగుతున్న సాగు ఖర్చులు.. అదనపు శ్రమతో కుంగిపోతున్న అన్నదాత
వర్షాకాలంలో నరకప్రాయంగా మారుతున్న ప్రయాణం.. స్పందించని పాలకులు, అధికారులు
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, జూలై 31 (నమస్తే న్యూస్ )
దేశానికి వెన్నెముక రైతు అని పదే పదే చెప్పే మాటలు.. తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని రైతుల విషయానికి వస్తే కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) ఇక్కడి రైతుల ప్రధాన సమస్య పరిష్కారానికి నోచుకోక, ప్రతి పంట సీజన్లోనూ అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వ్యవసాయ భూములకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, సాగు చేయడం కన్నా పొలాలకు వెళ్లడమే ఒక పెద్ద యుద్ధంలా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగుకు రాని యంత్రాలు.. భుజాలపైనే పంటల మోత!
నేటి ఆధునిక కాలంలో వ్యవసాయం అంతా యంత్రాలపైనే సాగుతుంటే, ఇక్కడి రైతులకు మాత్రం కాలినడకే దిక్కవుతోంది. పొలాలకు సరైన దారి లేకపోవడంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు లోపలికి రాలేని దుస్థితి నెలకొంది. పంట సాగు పనుల కోసం విత్తనాలు, ఎరువుల బస్తాలను మైళ్ల దూరం నడుచుకుంటూ మోసుకెళ్లాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యం బస్తాలను, పండించిన మిర్చి లేదా ఇతర పంటలను అమ్ముకోవడానికి రోడ్డు వరకు తేవాలంటే భుజాలపై మోయడమో, లేదా అదనపు కూలీలను పెట్టుకోవడమో తప్పడం లేదు. దీనివల్ల రైతులపై శారీరక శ్రమతో పాటు పెట్టుబడి ఖర్చులు భారంగా మారుతున్నాయి.
బురదమయంగా 'బాటలు'.. అత్యవసర పరిస్థితుల్లో ఆర్తనాదాలు!
వర్షాకాలం వస్తే ఇక్కడి రైతుల పరిస్థితి మరింత దారుణంగా, వర్ణనాతీతంగా మారుతోంది. పడిన ప్రతి వానకూ దారంతా మోకాళ్ళ లోతు బురద, నీటితో నిండిపోవడంతో పొలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. పొలాల్లో పనిచేసే సమయంలో ఎవరికైనా ప్రమాదవశాత్తు పాము కుట్టినా, లేదా గుండెజబ్బు వంటి అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినా కనీసం ఒక ఆటో లేదా అత్యవసర వాహనం (108) కూడా లోపలికి వచ్చే అవకాశం లేకపోవడం ఇక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేవలం హామీలే తప్ప క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడలేదని తిప్పారెడ్డిగూడెం రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి, తమ వ్యవసాయ భూములకు శాశ్వత రహదారిని నిర్మించి, రెండు దశాబ్దాల తమ కష్టాల నుంచి విముక్తి ప్రసాదించాలని ఇక్కడి రైతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.


