- గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం: డా. కుంభం అశోక్ రెడ్డి.
- పుట్టిన గ్రామం రుణం తీర్చుకునేందుకు ఉచిత వైద్య సేవలు.
నర్సింహులపేట, జూలై 29 (నమస్తే న్యూస్)
పుట్టిన నేల రుణం తీర్చుకోవాలనే సేవాభావంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. కుంభం అశోక్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రావాలంటే అర్హత కలిగిన వైద్య నిపుణులు ముందుకు వచ్చి సేవలు అందించాలని ఆయన సూచించారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పాత మండల కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ధన్వంతరి పిల్లల ఉచిత వైద్యశాలలో గురు పౌర్ణమి సందర్భంగా గురువులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి వైద్య సేవలను ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఉచిత వైద్యశాలను ప్రారంభించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తన వంతు కృషి కొనసాగిస్తానన్నారు.ప్రభుత్వ వైద్య సేవల మాదిరిగానే వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోకి వైద్య సేవలు మరింత విస్తరించాలంటే వైద్య నిపుణులు సేవా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ధన్వంతరి పిల్లల ఉచిత వైద్యశాలలో అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య సేవల సమయం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందని, ఆదివారం సెలవు ఉంటుందని వెల్లడించారు."నేను పుట్టిన గ్రామానికి నా వంతు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ ఉచిత వైద్య సేవలను ప్రారంభించాను" అని డా. అశోక్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


