గరిష్ట చిల్లర ధర (MRP) కంటే అధిక ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు – మండల వ్యవసాయ అధికారి కె.రాజు.
రిపోర్టర్: పిల్లల నరసింహారావు.
సెంటర్: బయ్యారం.
బయ్యారం,జూలై26 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తదితర వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా గరిష్ట చిల్లర ధర (MRP) ప్రకారమే విక్రయించాలి అని మండల వ్యవసాయ అధికారి కె. రాజు తెలిపారు.వ్యవసాయ శాఖకు అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో విచారించి, సంబంధిత దుకాణాల్లో బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు మరియు విక్రయ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరైనా MRP కంటే అధిక ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించినట్లు నిర్ధారణ అయితే, వారి హోదా లేదా ప్రభావంతో సంబంధం లేకుండా ఎవరినీ ఉపేక్షించకుండా ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు మరియు సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అదేవిధంగా, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు, అధిక ధరల వసూళ్లు లేదా ఇతర అవకతవకలు గమనించిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

