- ఆగస్టు 3లోపు ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి
- బీజేపీ శ్రేణులకు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు
రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, జూలై 28 (నమస్తే న్యూస్ )
బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి సోమవారం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా బీజేపీ సహచర కార్యకర్తలతో కలిసి గ్రామాల వారీగా బీఎల్ఏ-2లు, బీఎల్ఓలతో సమావేశమై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదవుతున్న వివరాలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటరు జాబితానే పునాది అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా భాగస్వామి అయ్యేలా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
వచ్చే నెల 3వ తేదీలోపు ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేలా ప్రతి బూత్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రవాస్ అభియాన్ ద్వారా బూత్ స్థాయి కార్యకర్తల్లో మరింత సమన్వయం పెంపొందించడంతో పాటు, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం జరుగుతోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తక్కల్లపల్లి నరేంద్రరావు, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు గుండా శ్రీనివాస్ రెడ్డి, భద్రం, గుండా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


