నర్సింహులపేట మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
ప్రజాపాలన వారోత్సవాల్లో పల్లెల్లో పండుగ వాతావరణం.
నర్సింహులపేట,27 మే (నమస్తే న్యూస్)
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని లోక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని మామోజీ తండా, నరసింహపురం బంజర లాలితండా, జయపురం, కొమ్ములవంచ గ్రామాల్లో మహిళా సంఘాల నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, మహిళలు, రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రతి గ్రామంలో సంఘ భవనాల నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత పదేళ్లలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం లేకపోయిందని విమర్శించారు.
పేదలకు సంక్షేమ ఫలాలు అందించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. గత పాలకులు ప్రజల సంపదను కొల్లగొట్టారని, ధనవంతులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.ప్రస్తుతం ప్రభుత్వం అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళల పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు వరి ధాన్యంపై రూ.500 బోనస్ అందిస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని తెలిపారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.అలాగే ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల బీమా సాయం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించే విధంగా ఇందిరమ్మ గృహ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒకే విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
గత పాలనలో భారీ అవినీతి జరిగిందని, ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, జిల్లా నాయకులు, మండల నాయకులు,యువజన నాయకులు,కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,బీఎల్ఏలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



