•ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు.
•ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.
•నాణ్యమైన బోధన, సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
నర్సింహులపేట,ఏప్రిల్ 29 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్ట్లో ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లక్ష్యం ఒకే క్యాంపస్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యను అందించడం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ల్యాబ్లు, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా వాతావరణం కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం.నర్సింహులపేట ZPHS ఎంపిక కావడంతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య తమ గ్రామంలోనే అందుబాటులోకి రానుంది. దీంతో విద్యార్థుల డ్రాప్అవుట్ శాతం తగ్గే అవకాశం ఉండగా, తల్లిదండ్రులపై ప్రైవేట్ విద్యాసంస్థల భారం కూడా తగ్గనుంది.ఈ ప్రాజెక్ట్ అమలు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని భావిస్తున్నారు.ఇకపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు (GO), బడ్జెట్ కేటాయింపు, నిర్మాణ పనుల ప్రారంభం వంటి దశలు కీలకంగా మారనున్నాయి.

