కోర్టు ధిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష.
(నమస్తే న్యూస్, ఏప్రిల్ 19,హైదరాబాద్):
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. భూవివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిర్దిష్ట గడువులోగా అమలు చేయకపోవడమే ఈ చర్యలకు కారణమని న్యాయస్థానం పేర్కొంది.
అయితే అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు వారాలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామ పరిధిలోని సుమారు 74.97 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించిన విషయంలో కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ఆర్డీవో వెంకటరెడ్డి అమలు చేయకపోవడంతో భూమి యజమాని నవాబ్ మహ్మద్ యూసుఫుద్దీన్ ఖాన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

