రేపటి నుండి మన వార్డు – మన బాధ్యత కార్యక్రమం.
హెల్మెట్ లేకుండా మున్సిపల్ వార్డుల్లోకి ప్రవేశం లేదు.
వార్డుల్లో వీధి వీధి, డోర్ టు డోర్ సర్వే.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్ క్రైమ్, ఏప్రిల్ 01)
ఏప్రిల్ 2వ తేదీ నుండి హెల్మెట్ లేకుండా మున్సిపల్ వార్డుల్లోకి ప్రవేశం ఉండదని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డా. శభరిష్ పి. ఆదేశాల మేరకు ప్రతీ మున్సిపల్ వార్డుల్లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా సీఐ, ఎస్ఐ స్థాయి నుండి సిబ్బంది వరకు వార్డుల్లో వీధి వీధి తిరిగి డోర్ టు డోర్ సర్వే నిర్వహించి ఎంతమందికి హెల్మెట్లు ఉన్నాయో, ఎంత మంది వాడుతున్నారో గుర్తించి, హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా వార్డుల్లో గంజాయి నిర్మూలనకు కూడా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ కౌన్సిలర్లు పోలీస్ శాఖతో కలిసి బాధ్యతగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని కోరారు.

