నమస్తే న్యూస్ దంతాలు పల్లి
బడ్జెట్లో బీసీలకు న్యాయం ఎక్కడ?
దంతాలపల్లిలో టిఆర్పి నిరసన గర్జన
బీసీలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ..
కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.మండల అధ్యక్షుడు కొండ వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు ఐలయ్య యాదవ్, మండల అధ్యక్షులు కొండ వెంకన్న లు మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ప్రతి సంవత్సరం ₹20,000 కోట్ల కేటాయింపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుత బడ్జెట్లో కేవలం ₹12,000 కోట్లకు మాత్రమే పరిమితం కావడం దారుణమని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 6 శాతం నిధులు కేటాయించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని, ఇది తీవ్ర అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ నిరసన లో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి సంతోష్, నరసింహులపేట అధ్యక్షుడు సాయి. విజయ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

