- మరిపెడలో కార్గిల్ విజయ్ దివస్ ను విజయవంతం చేయాలి.
- కార్గిల్ సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ చైర్మన్ గాదె రాంబాబు.
మరిపెడ,జులై 21(నమస్తే న్యూస్).1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకు మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ ఒకేతాటిపైకి రానున్నారు. కార్గిల్ సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ, తెలంగాణ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాబోయే ఆదివారం, జూలై 26,2026న ఉదయం 10:30 గంటలకు మరిపెడ మండలం, కార్గిల్ సెంటర్ వద్ద ఉన్న కార్గిల్ స్తూపం వద్ద ఘన నివాళుల కార్యక్రమం జరగనుంది.
సొసైటీ చైర్మన్ గాదె రాంబాబు విడుదల చేసిన ప్రకటనలో,దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను ప్రతి భారతీయుడూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది.వారి త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరులకు పుష్పాంజలి ఘటించాలని సొసైటీ పిలుపునిచ్చింది. 2005లో స్థాపించబడిన కార్గిల్ సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ రిజి.నెం.79/2005 ఆధ్వర్యంలోనే మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కార్గిల్ స్తూపం నిర్మించబడింది.ఢిల్లీలోని కార్గిల్ వార్ మెమోరియల్ తర్వాత దేశంలో నిర్మించిన రెండవ కార్గిల్ స్తూపం ఇదే కావడం జిల్లా ప్రజలకు గర్వకారణమని సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోహి రెడ్డి వైస్-చైర్మన్ గాదె ఉషా లతా రెడ్డి తెలిపారు.
కమిటీ సభ్యులు బాలుగూరి శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య,చిలుకూరి వెంకన్న,దార ఇందు భారతి,భూక్యా సుధాకర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.”నా దేహం ముక్కలైనా…దేశం ముక్కలు కానివ్వను” అన్న అమరవీరుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని సొసైటీ కోరింది.

