- మరిపెడ మండలం ఎల్లంపేట రైతు వేదికలో వార్డు సభ్యులకు శిక్షణ.
- గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు.
- 5వ రోజు ముగింపు శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ(జులై 03)నమస్తే న్యూస్.
మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయతీ రైతు వేదికలో వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది.చివరి రోజు కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి పుల్లారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి వార్డు సభ్యులకు,పంచాయతీ రాజ్ చట్టం 2018,గ్రామ అభివృద్ధి,పాలన అంశాలపై అవగాహన కల్పించారు.శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు.
వార్డు సభ్యుల పనులు,బాధ్యతలు,గ్రామ సభ జరపడం,తీర్మానాలు అమలు చేయడం,సభకు అవసరమైన సంఖ్య,నివేదికలు రాయడం,ప్రజల నుండి వినతులు తీసుకునే పద్ధతిపై పంచాయతీ కార్యదర్శులు మంజుల,అరుణ్,గోపీచంద్,లక్ష్మణ్,రాజూద్దీన్,మౌనిక,రజిత,రాజు వివరించారు.
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ,15వ ఆర్థిక సంఘం నిధుల వాడకం,ఉపాధి హామీ పథకం,సిమెంటు రోడ్లు,మురుగు కాల్వలు,మిషన్ భగీరథ,స్వచ్ఛ భారత్ పనుల అమలుపై రామోజీ,ప్రణయ్ సుమన్,దేవయ్య అవగాహన కల్పించారు.
ఇంటి పన్ను,నీటి పన్ను,వృత్తి పన్ను,అనుమతి రుసుముల వసూలు,ఆస్తి పన్ను లెక్కింపు,గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవడంపై జిల్లా పంచాయతీ అధికారి పుల్లారావు సూచనలు చేశారు. పింఛన్లు,ఆసరా,కళ్యాణ లక్ష్మి,రైతు బంధు,రైతు బీమా వంటి సంక్షేమ పథకాల అమలులో వార్డు సభ్యుల పాత్ర,లబ్ధిదారుల ఎంపికలో నిజాయితీ పాటించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూచించారు.
పారిశుధ్యం & ఆరోగ్య విభాగం: పారిశుధ్య పనులు,చెత్త సేకరణ,తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం,చెత్త దిబ్బ నిర్వహణ,కాలానుగుణ వ్యాధుల నివారణలో వార్డు సభ్యులు చేయాల్సిన పనులపై నిర్వాహకురాలు ఉమా ఆచరణాత్మక అంశాలు చెప్పారు.
వీధి దీపాలు & తాగునీటి విభాగం: వీధి దీపాల నిర్వహణ,తాగునీటి సరఫరా,నీటి సరఫరా మోటార్లను బాగు చేయడం,పైపు లైను పగిలిన,విరిగిన వాటిని సరిచేయడంలో వెంటనే స్పందించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో ఎల్లంపేట సర్పంచి గండి రాధమ్మ,శిక్షణ అధికారులు,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,నిర్వాహకులు,వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి అందరూ సమిష్టి కృషితో కలిసి పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమైతుందని,కలిసి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిలుపునిచ్చారు.



