విదేశీ విద్యా పర్యటనకు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు
ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దేశాలకు అవకాశం
భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే న్యూస్): తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీఈ ఆధ్వర్యంలో నిర్వహించే టీచర్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (ఫేజ్–2) కోసం అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఉపాధ్యాయులను ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దేశాలకు సెప్టెంబర్–అక్టోబర్ 2026లో ఐదు రోజుల విద్యా పరిచయ పర్యటనకు పంపించనున్నారు.
యాదాద్రి–భువనగిరి జిల్లా నుంచి మొత్తం ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వీరిలో ప్రిన్సిపాల్/జీహెచ్ఎం కేటగిరీ నుంచి ఇద్దరు, ఎస్ఏ/పీజీటీ/పీఎస్హెచ్ఎం కేటగిరీ నుంచి ఇద్దరు, ఎస్జీటీ/టీజీటీ కేటగిరీ నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ప్రాథమిక ఎంపిక నిర్వహించగా, రాష్ట్ర స్థాయి కమిటీ తుది ఎంపిక చేస్తుంది.దరఖాస్తుదారులు 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండటంతో పాటు కనీసం పదేళ్ల సేవ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో కనీసం 100 మంది విద్యార్థులు ఉండాలి. శాఖాపరమైన లేదా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండకూడదు. దీర్ఘకాలిక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవాలి.
విద్యా నాణ్యత పెంపు, విద్యార్థుల నమోదు వృద్ధి, వినూత్న బోధనా పద్ధతులు, ఐసీటీ వినియోగం, ఎస్సీఈఆర్టీఈ సేవలు, పాఠశాల అభివృద్ధిలో చేసిన కృషి, అవార్డులు, ఇంగ్లీష్లో భావ వ్యక్తీకరణ వంటి అంశాలను ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.అర్హులైన ప్రభుత్వ, జిల్లా పరిషత్, టీజీఎంఎస్, టీఆర్ఈఐఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను ఆగస్టు 5 సాయంత్రం 5 గంటలలోపు యాదాద్రి–భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని డీఈవో సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు.

