హర్యాలీ తీజ్ సందర్భంగా లంబాడీ ఆడపిల్లలకు అద్దాల డ్రెస్లు పంపిణీ చేయాలి.
ఆగస్టు 24న అధికారిక సెలవు ప్రకటించాలని డిమాండ్.
డోర్నకల్/మరిపెడ/ఆగస్టు 03(నమస్తే న్యూస్).
రంజాన్,క్రిస్మస్,బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం బట్టలు పంపిణీ చేస్తున్నట్లే,హర్యాలీ తీజ్ సందర్భంగా లంబాడీ ఆడపిల్లల వేషధారణను కాపాడేందుకు అద్దాల డ్రెస్లను ప్రభుత్వం పంపిణీ చేయాలని లంబాడీల ఐక్య వేదిక మహబూబాబాద్ జిల్లా మహిళా కన్వీనర్ మలోత్ మంజుల నాయక్ డిమాండ్ చేశారు.శ్రావణ మాస మొదటి శుక్ల పక్ష శుక్రవారం చాందిని రాత్ రోజున గోధుమలను తెచ్చి నానబెట్టి,శనివారం బుట్టల్లో వేసి డాక్పై పెడతారు.దీనిని తీజ్ బోయేరో అంటారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం కడావ్ తీజ్”నిర్వహిస్తారు.ఆ రోజు మ్యారామ భవానీకి,సద్గురు సేవాలాల్ మహారాజ్కు నైవేద్యం సమర్పించి,తండా పెద్దల ఆధ్వర్యంలో భోగ్ కార్యక్రమం జరుపుతారు.ఈ రోజు నుంచే 9 రోజుల తీజ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది.నిమజ్జనం రోజున ఆడపడుచులలో సాక్షాత్తు మ్యారామ భవానీని దర్శించి,అన్నదమ్ములు అక్కాచెల్లెల కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.వివాహం కాని గోర్ బంజారా అమ్మాయిలు 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ ఇది.తెలంగాణలో గిరిజన లంబాడీలు అధికంగా ఉండటంతో,ప్రభుత్వం హర్యాలీ తీజ్ను అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని ఆమె కోరారు.ఈ ఏడాది ఆగస్టు 24 న సెలవు ప్రకటించాలని,అలాగే 2027 రాష్ట్ర స్థాయి క్యాలెండర్ లో సెలవుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ సంవత్సరం ఆగస్టు 12న అమావాస్య ఉండటంతో,ఆ తర్వాత వచ్చే ఆగస్టు 15 శనివారం”తీజ్ బోయేరో”ఉత్సవాన్ని నిర్వహించాలని,కొన్ని ప్రాంతాల్లో “చుటో కడావ్” జరుపుకునే వారు ఆగస్టు 23 ఆదివారం చేసుకోవాలని మలోత్ మంజుల నాయక్ కోరారు.

