- బచ్చోడు తండాలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన షేక్ మీరా.
- డెంగ్యూ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశం.
- గ్రామపంచాయతీ సిబ్బంది, వైద్యులకు కీలక సూచనలు.
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీవో.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 1 (నమస్తే న్యూస్ )
మండలంలోని బచ్చోడు తండాలో డెంగ్యూ జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలను శనివారం ఎంపీఓ షేక్ మీరా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని వీధులు, డ్రైనేజీలు, నీటి నిల్వ ప్రాంతాలను తనిఖీ చేసి, ఎక్కడా మురుగునీరు లేదా వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.అనంతరం సుబ్లేడ్ తండా పరిధిలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారికి తక్షణమే వైద్య సేవలు అందించాలని, జ్వరాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. గ్రామంలో ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కుండీలు, టైర్లు, డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం లేదా డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.డెంగ్యూ నియంత్రణలో అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొంటూ, అందరూ సమన్వయంతో పనిచేస్తేనే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని షేక్ మీరా తెలిపారు.గ్రామ సర్పంచ్ కుమారి బాలు,హెచ్ వి మాధవి, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఆశా వర్కర్లు కవిత, సుజాత, పంచాయతీ కార్యదర్శి ఉష, వివో ఏ ధరావత్ జయ, అంగన్వాడి టీచర్ సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
