బీరోలు దళిత కాలనీల్లో సీసీ రోడ్ల కోసం ఎదురుచూపులు
వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.
తిరుమలాయపాలెం, జూలై 12 (నమస్తే న్యూస్): ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు గ్రామంలో దళిత కాలనీల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వీధులు బురదమయంగా మారి ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు, వృద్ధులు, మహిళలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఇతర వాహనాలు కాలనీల్లోకి చేరుకోవడం కూడా కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.గ్రామంలోని కొన్ని బజారు ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా కాలనీలకు ప్రాధాన్యత ఇచ్చి సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరుతున్నారు.ఈ సమస్యపై గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.


