- మాజీ ఎంపీ కేటాయించిన ఆలయ భూమి కబ్జా.
- కబ్జా చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై గ్రామస్తుల ఫిర్యాదు.
- రైతుబంధు పేరుతో 12 ఏళ్లుగా లబ్ధి పొందుతున్నారని ఆరోపణ.
డోర్నకల్/మరిపెడ,జులై 06(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మాకుల్ల ఆలయానికి మాజీ పార్లమెంట్ సభ్యులు రామసహాయం సురేందర్ రెడ్డి పేరిట ఆలయానికి కేటాయించిన 2 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు,గత 12 ఏళ్లుగా రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సుప్రసిద్ధ మాకుల శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయానికి రామసహాయం సురేందర్ రెడ్డి 2 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించారు. ఈ భూమిని గతంలో ఆలయ మేనేజర్గా పనిచేసిన ఓ అధికారి, ప్రస్తుతం ఆలయ అర్చకుడిగా ఉన్న మరో వ్యక్తి తో కలిసి సుమారు 8 గుంటల భూమిని ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఆక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి అనంతరం ఆ ఇళ్లను తమ కుటుంబ సభ్యుల పేరిట అప్పటి మరిపెడ జీపీ రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోపక్క ఆ స్థలాన్ని వ్యవసాయ భూమిగా చూపిస్తూ గత 12 ఏళ్లుగా రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు మరిపెడకు చెందిన వెర్మరెడ్డి వెంకటరెడ్డి,కుడితి వెంకటరెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ను కలిసి గ్రీవెన్స్ సెల్లో లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్లు కట్టడమే కాకుండా రైతుబంధు పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.భార్యలలో ఒకరు గతంలో గుంజేడు ముసలమ్మ ఆలయంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కి అరెస్టై సస్పెండ్ అయ్యారు” అని తెలిపారు.ఈ విషయంపై సంబందిత అధికారులతో విచారణ జరిపించి, సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, రెవెన్యూ రికవరీ చట్టం కింద ఇప్పటివరకు పొందిన రైతుబంధు సొమ్మును తిరిగి రాబట్టాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు.ఆలయ భూమి ఆలయానికి చెందేలా వెంటనే అధికారులు స్పందించి,ఆ భూమిని ఆలయానికి అప్పగించాలని కోరారు.

