11వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం.
నమస్తే న్యూస్ కథనానికి స్పందించిన మున్సిపల్ యంత్రాంగం.
తొర్రూరు, జూలై 06 (నమస్తే న్యూస్)
తొర్రూరు పట్టణంలోని 11వ వార్డు చెరువు కట్ట సమీప ప్రాంతంలో నెలరోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ సమస్యపై నమస్తే న్యూస్లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించింది.కథనం వెలువడిన కొద్ది గంటల్లోనే 11వ వార్డు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ అధికారులు సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు.బోరింగ్, మోటార్కు సంబంధించిన సాంకేతిక లోపాలను గుర్తించి వెంటనే కొత్త మోటార్ను అమర్చడంతో తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడతామని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా కూడా ప్రజలకు తాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు.నెలరోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన నమస్తే న్యూస్ కథనం అనంతరం మున్సిపల్ యంత్రాంగం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన 11వ వార్డు కౌన్సిలర్,మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ సేవలందిస్తున్న నమస్తే న్యూస్ను అభినందించారు.



