దంతాలపల్లిలో ఎరువులు, విత్తనాల దుకాణాల తనిఖీ
ఈ-పాస్ ద్వారానే యూరియా విక్రయించాలి.. రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి: ఏడీఏ మురళి
దంతాలపల్లి, జూలై 23 (నమస్తే న్యూస్):
దంతాలపల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను మరిపెడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మురళి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశారు.
ప్రతి రైతుకు ఈ-పాస్, యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే యూరియాను విక్రయించాలని, ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లు అందజేయాలని సూచించారు. అలాగే దుకాణాల్లో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
అనంతరం మండలంలోని పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి, విత్తనాల నాణ్యత పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై మండల వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను రైతులకు సమర్థవంతంగా చేరవేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాహిని, ఏవో (టెక్నికల్) శ్రీదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.




