- అక్రమ ఇసుక రవాణాపై అధికారుల నిర్లక్ష్యం.. రెండు ట్రాక్టర్ లు బోల్తా.
- జిల్లా కలెక్టర్ హెచ్చరించినా ఆగని అక్రమ ఇసుక రవాణా.
నర్సింహులుపేట, జూన్ 6 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం బక్కతండ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో ట్రాక్టర్ రోడ్డుపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడగా, ట్రాక్టర్కు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.స్థానికుల కథనం ప్రకారం బక్కతండ శివారులో ఇదే ప్రాంతంలో మరో ఇసుక ట్రాక్టర్ కూడా బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు అక్రమ ఇసుక రవాణాపై అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి.
జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలుమార్లు అధికారులను ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.నర్సింహులపేట మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధిక లోడుతో, అతివేగంగా ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు సాగించడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

