Type Here to Get Search Results !

నర్సింహులపేట లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహణ.


అమరవీరుల త్యాగాలను స్మరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు.






నర్సింహులపేట, జూన్ 2 (నమస్తే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా రక్షక భటుల నిలయంలో ఎస్సై భానోత్ వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్‌బాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాముఖ్యతను వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయంలో చైర్మన్ సంపేట రాము గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన సుదినంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అభివర్ణించారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన వీరులను స్మరించుకున్నారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాధిక జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నర్సింహులపేట సర్పంచ్ పెద్దమాముల యాకయ్య జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు.మండల వ్యాప్తంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవం, అమరవీరుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాగాయి.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.